కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డికి షాక్‌

హైదరాబాద్‌ : తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌ రెడ్డికి భారీ షాక్‌ తగిలింది. ఆయన గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడంగల్‌లో కాంగ్రెస్‌కు చేదు ఫలితాలు వచ్చాయి. కొడంగల్‌ మున్సిపాలిటీలో అధికార టీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది. మొత్తం 12 వార్డుల్లో గులాబీ పార్టీ 7 గెలుపొందగా, కాంగ్రెస్‌ కేవలం మూడు స్థానాలకు పరిమితమైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్‌ రెడ్డి కొడంగల్‌కు ఎక్కువ సమయం కేటాయించినప్పటికీ ఫలితం లేకపోయింది. టీఆర్‌ఎస్‌కు కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పునరావృత్తం చేస్తూ.. కొడంగల్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్‌ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు.



కాగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌​ఎస్‌ సంచలన రీతిలో విజయం సాధిస్తోంది. ప్రతిపక్షాలు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయ్యాయి. దీంతో మెజార్టీ జిల్లాల్లో ఫలితాలు ఏకపక్షం అయ్యాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం మొత్తం 120 మున్సిపాలిటీల్లో 80కుపైగా టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. మెజార్టీ స్థానాల్లో ముందంజంలో ఉంది. కార్పొరేషన్లలో కూడా కారు దూసుకుపోతోంది.   (కాంగ్రెస్‌ కంచు కోటకు బీటలు)